నేతన్నలను ప్రభుత్వం ఆదుకోరా: బీఎస్పి నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని

నకిరేకల్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 13: చేనేత కార్ముకులను ప్రభుత్వం ఆదుకోవాలని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. బుధవారం నకిరేకల్ మున్సిపాలిటీ కేంద్రంలో పద్మశాలి కాలనీలో గడప గడపకు ఏనుగు గుర్తు ను పరిచయం చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం జియో ట్యాగింగ్‌ వల్ల ఇంట్లో ఒక్కరికే లబ్ది చేకూరుతుంది అని అన్నారు. మరి రంగులు అద్దె వారు, చిన్న చిన్న పనులు చేసే వారు చేనేత కార్మికులు కారా అని అడిగారు. జియో ట్యాగింగ్‌ వల్ల చేనేత కుటుంబాలు నష్టపోతున్నారు అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం, చేనేత రంగ అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయని పత్రికల్లో ప్రకటనలు చూస్తూనే ఉన్నాం. కానీ వాస్తవానికి చేనేత కార్మికులకు ఆసరా పింఛన్లు తప్ప మరో పథకం అందడం లేదన్నది ముమ్మాటికీ నిజం అన్నారు. అత్యధిక ఓటర్లున్న పద్మశాలీలకు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా సరైన పథకాలు అందించి చేనేత కార్మికులను ఆదుకున్న పాపాన పోలేదు అని అన్నారు.‘చెప్పుకొని మురువు చూసుకొని ఏడువు’ నానుడి నేటికీ నిజం. చేనేత కార్మికుల సంక్షేమం కోసం పాటు పడని నాయకుల వల్ల నేడు నేతన్నలు అత్యంత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అని అన్నారు. నాయకులు ఎన్నికల సమయానికి ఓటు బ్యాంకుగా పద్మశాలీలను ఉపయోగించుకుంటున్నారు తప్ప, వారికి ఎలాంటి ఉపయోగకరమైన పథకాలు అందించకపోవడం శోచనీయం. ఫలితాలు ఇవ్వని పథకాలు చేనేత మిత్ర పథకం ద్వారా 40 శాతం నూలు రాయితీ, నేతన్నకు చేయూత తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొన్ని నెలల క్రితం వార్తల్లో వచ్చింది. కానీ వార్తల్లో వచ్చే ప్రతి పథకం చేనేత కార్మికులకు అందుతుందని అనుకోవడం అంతకు మించిన పొరపాటు లేదు. అసలు ఈ పథకం అమలులో ఉందో లేదో.. కూడా చేనేత కార్మికులకు తెలియదు అని అన్నారు.

50 సంవత్సరాలు పైబడిన ప్రతి నేత కార్మికుడికి పెన్షన్ 2000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం కొద్ది మందికే ఇవ్వడం విచారకరం. వారికి జీఐ ట్యాగ్ లేనందున పెన్షన్ పొందలేకపోతున్నారు. ఆ ట్యాగ్ కోసం ప్రయత్నించినా ప్రభుత్వం స్పందించడం లేదు.ఐక్యంగా పోరాడాలి..నేతన్నలకు ప్రభుత్వ పథకాలే కాక, వారు నేచిన బట్టలకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. అసలే ముడిసరుకు కొనుగోలు కోసం ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తుంది. దీంతో రవాణా ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తోందని గ్రామాల్లోని నేత కార్మికులు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినా ఫలితం శూన్యం. ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలలో యూనిఫాం దుస్తుల కోసం చేనేత కార్మికులు నేసిన గుడ్డను ప్రభుత్వం కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. అత్యధిక ఓటర్లైన పద్మశాలీలకు నాయకులు ఎన్నికల సమయంలో ఏదో ఒక ఆశ చూపి ఓట్లు వేయించుకునుడు ప్రతీ ఎలక్షన్స్ సమయంలో జరిగేదే. నాయకులు ప్రతిసారి వారి ఓట్ల ద్వారా గెలుపొంది ఆ తరువాత వారికి ఎలాంటి ప్రయోజనకరమైన పథకాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటు. అంతేకాదు పద్మశాలీలు రాజకీయంగా ఎదగకుండా ఎలాంటి పదవి అవకాశాలు కల్పించకుండా అణిచివేతకు గురిచేస్తున్నారు. అందుకే చేనేత కార్మికులందరూ ఐక్యంగా పోరాడి తమ హక్కులు పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి చేనేత కార్మికుడికి ఉంది. ఇకనైనా ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకొని వారికి అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళ కన్వీనర్ మర్రి శోభ, కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్,సీత యశ్వంత్, జగదీష్, కృష్ణ,యోగి, మల్లేష్ బిఎస్పి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top