ర‌క్తాన్ని రంగుగా మార్చే నేత‌న్న‌ల‌కు సలాం : మంత్రి కేటీఆర్

యాదాద్రి భువ‌న‌గిరి, ప్రజానేత్రం, ఆగష్టు 12: ర‌క్తాన్ని రంగుగా మార్చి మ‌న‌షుల‌కు నాగ‌రిక‌త అద్దిన నేత కార్మికులంద‌రికీ హృద‌య‌పూర్వ‌కంగా స‌లామ్ అని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డితో క‌లిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నిర్వ‌హించిన‌ చేనేత వారోత్సవాల్లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. సీఎం కేసీఆర్‌కు నేత‌న్న‌ల క‌ష్టాలు తెలుసు. నేత‌న్న‌ల సంక్షేమం కోసం భార‌త‌దేశంలో ఎక్క‌డా లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారు. చేనేత మిత్ర పేరుతో నూలు, ర‌సాయ‌నాల మీద 50 శాతం స‌బ్సిడీ ఇస్తున్నామన్నారు. చేనేత మిత్ర ద్వారా నెల‌కు రూ. 3 వేల చొప్పున ప్ర‌తి కార్మికుడికి వ‌చ్చే నెల నుంచి మీ ఖాతాల్లో జ‌మ చేయ‌బోతున్నాం. నేత‌న్న‌కు బీమా అర్హ‌త‌ను 75 ఏండ్ల‌కు పెంచామ‌న్నారు. దీని వ‌ల్ల వేలాది మంది నేత‌న్న‌ల‌కు లాభం జ‌ర‌గ‌నుంది. నేత‌న్న‌కు చేయూత ద్వారా.. 26 వేల కుటుంబాల‌కు రూ. 96 కోట్లను మెచ్యూరిటీ పూర్తి కాకుండానే క‌రోనా కాలంలో ఇచ్చామ‌ని చెప్పారు. మ‌గ్గాలు ఆధునీక‌రించుకోవాలి. గుంట మ‌గ్గాల స్థానంలో ఫ్రేమ్ లూమ్స్ తీసుకొస్తున్నాం. దీన్ని రూ. 40 కోట్ల‌తో చేనేత మ‌గ్గం అనే కార్య‌క్ర‌మం కింద తీసుకొచ్చామన్నారు. గ‌తంలో ఎవ‌రైనా నేత కార్మికుడు చ‌నిపోతే ద‌హ‌న‌సంస్కారాల నిమిత్తం టెస్కో నుంచి రూ. 5 వేలు అందించేవారు. కానీ ఇప్పుడు రూ. 25 వేలు ఇచ్చేలా నిర్ణ‌యం తీసుకున్నాం. త్వ‌ర‌లోనే ఈ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేయ‌బోతున్నామ‌ని పేర్కొన్నారు. పోచంప‌ల్లి హ్యాండ్లూమ్ పార్కు 22 ఎక‌రాల్లో ఉంది. దాన్ని బ్ర‌హ్మాండంగా త‌యారు చేస్తాం. దాంట్లో వ‌చ్చే లాభాల‌ను మీ పోచంప‌ల్లి మండ‌లంలోని ప్ర‌తి నేత కుటుంబానికి అందిస్తాం. ఆ ఓన‌ర్‌షిప్‌ను మీకే అప్ప‌జెప్తాం. వ్య‌వ‌సాయం త‌ర్వాత చేనేత రంగం అధిక మందికి ఉపాధి క‌ల్పిస్తుంది. అగ్గిపెట్టె లో ప‌ట్టే చీర‌ను నేసిన నైపుణ్యం ఉన్న నేత‌న్న‌లు మ‌న తెలంగాణ నేత‌న్న‌లు. అందుకే ప్ర‌భుత్వం అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిలు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, పైల్ల శేఖర్ రెడ్డి, గొంగడి సునిత, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సైది రెడ్డి, లింగయ్య, రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top